Friday 24 June 2011

ఈ అయిదు అమ్మవారి ప్రధానరూపాలు .

0 comments
శ్రీకృష్ణున్ని అవతరింపజేయటం కోసం లోకజనని అయిదురూపాలు ధరించింది . ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక బేధాలున్నాయి .భక్తులను అనుగ్రహించటం కోసం ,తన బిడ్డలైన వారి అభ్యర్దన మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది అమ్మ. అయితే మూలప్రకృతినుంచి ఆవిర్భవించిన రూపాలు ప్రధానమైనవి మాత్రం ఇవి






వాటిలో మొదటిరూపం శివప్రియ,గణేశమాతదుర్గ. శివరూప ,విష్ణుమాయ ,నారాయణి,పూర్ణబ్రహ్మ స్వరూపిణి ,సర్వాధిష్టాత్రి ,శర్వ రూప ,సనాతని,ధర్మసత్య,పుణ్యకీర్తి.యశోమంగళ దాయిని, సుఖమోక్ష,హర్ష ధాత్రి ,శోఖార్తి దు:ఖనాశిని ,శరణాగత దీనార్తపరిత్రాణపరాయణ ,తేజ:స్వరూప ,సర్వశక్తి స్వరూప ,సిద్ధేశ్వరి ,సిధ్ధరూప .సిద్ధిద ,బుద్ధి,నిద్ర క్షుత్తు,పిపాస ,చాయ,తంద్ర,దయ,స్మృతి ,జాతి,క్షామ్తి,భ్రాంతి,శాంతి,చేతన,తుష్టి ,పుష్టి లక్ష్మీ,ధృతి ,మాయ -----ఇత్యాది నామాలతో కీర్తింపబడుతుంది

.




ఇక రెండవది శుధ్ధ శక్తి స్వరూప మహాలక్ష్మి . సర్వ సంపత్స్వరూప .సంపదధిష్టాత్రి ,పద్మ,కాంత ,దాంత, శాంత.సుశీల,సర్వ మంగళ,లోభకామ మోహ మదహంకార వివర్జిత భక్తానురక్త ,పతివ్రత, భగవత్ప్రాణతుల్య, భగవత్ ప్రేమపాత్ర ,ప్రియంవద ,సర్వాత్మిక , జీవనోపాయరూపిణి. వైకుంఠం లో ఈ మహాలక్ష్మి పతిసేవాపరాయణయై నివసిస్తూ ఉంటుంది . సర్వప్రాణి కోటిలోనూ శోభారూపంగా ఉంటుంది . స్వర్గం లో స్వర్గ లక్ష్మిగా ,రాజులలో రాజ్య లక్ష్మిగా,గృహాలలో గృహలక్ష్మిగా విరాజిల్లుతుంటుంది . పుణ్యాత్ములకు కీర్తిరూప ,నరేంద్రులకు ప్రభావరూప ,వైశ్యులకు వాణిజ్యరూప,పాపాత్ములకు కలహాంకురరూప .వేదాలలో హయరూపంగా వర్ణింపబడినది సర్వపూజ్య,సర్వ వంద్య.


ఇక మూడవరూపం వాగ్బుధ్ధివిద్యాజ్ఞానాధిష్టాత్రియైన సరస్వతి .సర్వవిద్యాస్వరూప ,బుధ్ధి కవిత,మేధ,ప్రతిభ,స్మృతి ,ఇత్యాదులన్నీ మానవులకుఈవిడ దయవలనే కలుగుతున్నాయి. సిధ్ధాంత బేధాలు అర్ధబేధాలు కల్పించేది ఈతల్లే .ఈవిడే .వ్యాఖ్యాస్వరూపిణి ,బోధస్వరూపిణి సర్వ సందేహ భంజని .విచారకారిణి ,గ్రంథ కారిణి,శక్తిరూపిణి,.సర్వసంగీత సంధాన తాళ కారణ రూపిణి ,విషయ జ్ఞాన వాగ్రూప ,ప్రతివిశ్వోపజీవని ,వ్యాఖ్యావాదకరి,శాంత .వీణాపుస్తకధారిణి ,శుద్ధసత్వరూప ,సుశీల,శ్రీహరిప్రియ,,హిమ,చందన.కుంద,ఇందు,కుముద,అంభోజసన్నిభ . రత్న జపమాలికతో శ్రీకృష్ణున్ని ధ్యానించే తప:స్వరూపిణి .తప:ఫలప్రద .సిద్ధవిద్యాస్వరూప .సర్వసిధ్ధి ప్రద . ఈ తల్లి లేకుంటే సర్వజనులు మూగవారవుతారు .



ఇక నాల్గవరూపం చతుర్వర్ణాలకు చతుర్వేదాలకు వేదాంగాలకు అధిష్టానదేవత . సంధ్యావందనమంత్రతంత్ర స్వరూపిణి,ద్విజాతిజాతిరూప ,తపస్విని,జపరూప,బ్రహ్మణ్యతేజోరూప సర్వసంస్కారరూపిణి ,సావిత్రి,గాయత్రి ,బ్రహ్మప్రియ . ఆత్మశుద్ధికోసం సర్వతీర్ధాలు ఈతల్లి సంస్పర్షను కోరుకుంటాయి. శుధ్ధస్పటికవర్ణ,శుధ్ధ స్వరూపిణి పరమానంద ,పరమ,సనాతని పర బ్రహ్మస్వరూపిణి నిర్వాణప్రదాయిని బ్రహ్మతేజోమయి ,ఈతల్లి పాదధూళిసోకి జగత్తు పునీతమవుతున్నది.

ఇక అయిదవ రూపాన్ని వర్ణిస్తున్నాను నారదా! ఆలకించు.




అయిదవరూపం . పంచప్రాణాలకు అధిష్టానదేవత . పంచ ప్రాణ స్వరూపిణి ,ప్రాణాధికప్రియతమ ,అందరికన్నా అందగత్తె .సౌభాగ్యమానిని గౌరవాన్విత ,వామాంగార్ధస్వరూప ,తేజోగుణసమన్విత . పరాపరసారభూత ,పరమ. ఆద్య.సనాతని పరమానందరూపిణి ,,ధన్య,మాన్య,,పూజ్య, శ్రీకృష్ణునికి రాసక్రీఢాధిదేవత ,రాసమండల సంభూత,రాసమండల మండిత,రాసేశ్వరి,సురసిక ,రాసావాస నివాసిని ,గోలోకవాసిని ,గోపీవేషవిధాయక.పరమాహ్లాదరూప .సంతోష హర్షరూపిణి ,,నిర్గుణ, నిరాకార, నిర్లిప్త,ఆత్మస్వరూపిణి ,నిరీహ, నిరహంకార. భక్తానుగ్రహ నిగ్రహ ,విచక్షణులు వేదానుసార జ్ఞానం తో ఈవిడను తెలుసుకుంటారు .సురేంద్రమునీంద్రాదులైనా చర్మచక్షువులతో ఈవిడను చూడలేరు . వహ్నిలాంటి అంశుకాన్ని ధరించి ఉంటుంది . నానాలంకార విభూషిత .కోటిచంద్రప్రభ .పుష్టిసర్వశ్రీయుక్తవిగ్రహ. శ్రీకృష్ణుని పట్లభక్తితో దాస్యం చేస్తూ ఉంటుంది . వరాహావతారకాలంలో ఈవిడ వృషభానునిఇంట కూతురుగా ఉద్భవించింది .
ఈ తల్లి పాదస్పర్షతో వసుంధర పావనమయ్యింది. శ్రీకృష్ణుని వక్షస్థలం లో నివసిస్తూ నీలమేఘావృతమైన ఆకాశం లో మెరుపుతీగలా భాసిస్తున్నది.
ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలిగోటిని సందర్శించి తనను తాను శుద్ధిచేసుకుందామని ఆశించి అరవైవేల దివ్యసంవత్సరాలు తపస్సుచేసినా ఫలితం దక్కలేదు. కనీసం కలలోనైనా దర్శనం కాలేదు. అతడికి అలాదొరకని సందర్శన భాగ్యం భూలోకంలో లభించింది .బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది . ఈరాధ దేవీ పంచమరూపం


నారదా ! స్రుష్టిలో కనిపించే ప్రతిస్త్రీలోనూ దేవీరూపం కళారూపంగానో,కాలరూపంగానో,అంశరూపంగానో కళాశాంశారూపంగానో ఉంటూనే ఉంటుంది .స్త్రీలందరూ దేవీ స్వరూపాలే . పరిపూర్ణ స్వరూపాలు మాత్రం ఈ అయిదే.  [ దేవీ భాగవతం నుండి ]
Read more...

Wednesday 22 June 2011

నీతి శ్లోక, పద్యములు

1 comments

మంగళాచరణమ్‌

దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్ర మూర్తయే ।
స్వానుభూత్యేక మానాయ నమః శాంతాయ తేజసే ॥ 1


తాత్పర్యము: త్రిలోకములూ, త్రికాలములూ, దశదిశలూ, అంతటా, అన్నిటా తానే అయి ఆత్మజ్ఞానుభవము చేత మాత్రమే గుర్తించదగిన జ్యోతిస్వరూప పరబ్రహ్మమునకు నమస్కారము.


మూర్ఖపద్ధతి

బోద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః ।
అబోధోపహతాః చాన్యే జీర్ణమంగే సుభాషితమ్‌ ॥
అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః ।
జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి తం నరం న రంజయతి ॥


తాత్పర్యము: బోధించే స్థానములో గురువులు మదమత్సర అసూయా పూరితులై వున్నారు. పాలించే ప్రభువులు గర్వాంధులైనారు. సామాన్యజనులు విని గ్రహించగలిగినంతటి తెలివిగలవారు కారు. కావున నా యీ సుభాషితము నాలోనే జీర్ణించుకుపోయి ఉన్నది. అనగా తన మనస్సు నందు అంతర్లీనముగా యింతకాలం వుండి పోయినదని అర్థము.


ప్రసహ్య మణిముద్ధరేన్మకర వక్త్ర దంష్ట్రాంతరాత్‌
సముద్రమపి సంతరేత్ప్రచలదూర్మి మాలాకులమ్‌ ।
భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్‌
న తు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్‌ ॥


తాత్పర్యము: మొసలి నోటికోరల మధ్య నున్న మాణిక్యమును ప్రజ్ఞతో బయటికి తీయవచ్చును. పెద్దపెద్ద అలలతో ఎగసిపడుతున్న సముద్రమును దాటవచ్చును. ఆగ్రహముతో బుసలు కొడుతున్న సర్పమును పూలదండలా శిరస్సున ధరించవచ్చును. కానీ దురాగ్రహపూరితుడైన మూఢుని సమాధాన పర్చుట అసాధ్యము.


లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్‌
పిబేచ్చ మృగ తృష్ణికాసు సలిలం పిపాసార్దితః ।
కదాచిదపి పర్యటన్‌ శశ విషాణమాసాదయేత్‌
న తు ప్రతినివిష్ట మూర్ఖ జనచిత్తమారాధయేత్‌ ॥


తాత్పర్యము: ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావులలో సైతం నీరు సంపాదించి దాహం తీర్చుకోవచ్చును. తిరిగి తిరిగి ఎలాగైనా కుందేలు కొమ్ము సంపాదించవచ్చును. (కుందేలుకు చెవులే కానీ కొమ్ములుండవు) కానీ ఎన్ని విధాల ప్రయత్నించినా మూర్ఖుని మనస్సును రంజింపచేయలేము.


వ్యాళం బాల మృణాల తంతుభిరసౌ రోద్ధుం సముజ్జృంభతే
భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమ ప్రాంతేన సన్నహ్యతి ।
మాధుర్యం మధుబిందునా రచయితుం క్షారాంబుధే రీహతే
మూర్ఖాన్యః ప్రతినేతు మిచ్ఛతి బలాత్సూక్తైః సుధా స్యందిభిః ॥


తాత్పర్యము: తామర తూటి దారములతో మదపుటేనుగును బంధించాలని ఆలోచించేవాడూ, దిరిసెనపువ్వు కొనతో వజ్రమును సానపట్టాలని ప్రయత్నించేవాడూ, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తియ్యగా మార్చాలనుకునే వాడితోనూ మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ఆశించినవారు సమానులవుతారు.


స్వాయత్త మేకాంతహితం విధాత్రా
వినిర్మితం ఛాదనమజ్ఞతాయాః ।
విశేషతః సర్వ విదాం సమాజే
విభూషణం మౌనమపండితానామ్‌ ॥


తాత్పర్యము: మూఢులు తమ మూఢత్వాన్ని దాచుకోవడానికై బ్రహ్మ మౌనమును సృష్టించి వారి స్వాధీనం చేశాడు. కావున పండితుల సమక్షమున మౌనమే మూర్ఖులకి అలంకారము. అనగా మూర్ఖులు తెలియని విషయాలను చర్చించరాదు.


యదా కించిద్‌జ్ఞో-హం ద్విప ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞో-స్మీత్యభవ దవలిప్తం మమ మనః ।
యదా కించిత్కించిద్బుధజన సకాశాదవగతం
తదా మూర్ఖో-స్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః ॥


తాత్పర్యము: నాకేమి తెలియని కాలములో అంతయూ తెల్సిన సర్వజ్ఞునిగా భావించుకొని మదగజములా విర్రవీగాను. తదుపరి ప్రాజ్ఞుల వలన కొద్దిగా తెల్సుకొన్నంతనే - నేను మూర్ఖుడినని, నాకేమీ తెలియదని గ్రహించి - జ్వరము తగ్గి కుదుటపడినట్లుగా నన్ను ఆవరించి వున్న గర్వము వదిలి సుఖించాను.


కృమి కుల చిత్తం లాలా క్లిన్నం విగంధి జుగుప్సితం
నిరుపమ రసం ప్రీత్యా ఖాదన్ఖరాస్థి నిరామిషమ్‌ ।
సురపతిమపి శ్వా పార్శ్వస్థం విలోక్య న శంకతే
న హి గణయతి క్షుద్రో జంతుః పరిగ్రహ ఫల్గుతామ్‌ ॥


తాత్పర్యము: గాడిద యెముకలో మాంసము లేకపోయినా, దానిలో పురుగులు చేరినా, డొల్లుతో తడిసి కంపు కొడుతూ రోతపుట్టిస్తున్నా కూడా దానిని ప్రీతితో కొరుకుతూ వున్న కుక్క తన ముందు దేవేంద్రుడు ప్రత్యక్ష్యమైనా సిగ్గుపడదు. ఏలననగా, తాను స్వీకరించిన పదార్ధం తుచ్ఛమా, కాదా అను విషయాన్ని నీచప్రాణి పట్టించుకోదు!


శిరః శార్వం స్వర్గాత్పశుపతి శిరస్తః క్షితిధరం
మహీధ్రాదుత్తుంగాదవనిమవనేశ్చాపి జలధిమ్‌ ।
అధో గంగా సేయం పదముపగతా స్తోకమథవా
వివేక భ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః ॥
తాత్పర్యము: గంగానదీమ తల్లి మొదట అంతరిక్షము నుండి ఏశ్వరుని శిరస్సు మీదకూ, అక్కడి నుండి హిమాలయముల మీదకూ, అచటినుండి భూమికీ, ఆపైన భూమి నుండి సముద్రములోనికి చేరి పాతాళమునకు చేరుకున్నది. అగ్రపీఠము నుండి స్థానభ్రంశము చెందిన వారికి యీ విధమైన అధఃపాతాళము సంభవిస్తుంది.


శక్యో వారయితుం జలేన హుతభుక్ఛత్రేణ సూర్యాతపో
నాగేంద్రో నిశితాంకుశేన సమదో దండేన గౌర్గర్దభః ।
వ్యాధిర్భేషజ సంగ్రహైశ్చ వివిధైర్మంత్ర ప్రయోగైర్విషం
సర్వస్యౌషధమస్తి శాస్త్ర విహితం మూర్ఖస్య నాస్య్తౌషధమ్‌ ॥


తాత్పర్యము: నిప్పును నివారించడానికి నీటిని, సూర్యతాప నివారణకు గొడుగునూ, మత్తగజమునకు అంకుశాన్ని, గాడిద, ఎద్దు తదితర జంతువుల కోసం కర్రనూ, రోగమునకు వివివ్ధ ఔషధములనూ, విషమునకు నివారణగా వివిధ మంత్రాలనూ శాస్త్రములందు వుదహరించబడ్డాయి. కానీ మూర్ఖత్వమును నివారించు మందు ఏదీ శాస్త్రములలో తెలుపలేదు. అనగా మూర్ఖత్వమునకు విరుగుడు లేదని భావం.
"గీత మంజరి" లోని నీతి పద్యం
సరి యయిన మార్గమును బట్టి సంచరించు
నతడు చేరు గమ్యస్థానమశ్రమమున
ఇనుప పట్టీలపై నుండి యేగునట్టి
ధూమ శకటంబు వలె శ్రేణి దొలగకుండ





Read more...

Monday 13 June 2011

పావులూరి మల్లన

0 comments
పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. ఇతని కాలం స్పష్టంగా తెలియడంలేదు. ఇతను నన్నె చోడుని కాలం వాడని వాదాలున్నాయి. ఇతడు గణితసార సంగ్రహము అనె గణితగ్రంధాన్ని వ్రాశాడు. రాజరాజునుండి ఇతనికి నవఖండవాడ అగ్రహారం లభించిందట. తెలుగు పద్యానికి ఆరంభదశ అనుకొనే ఆ కాలంలోనే గణిత శాస్త్ర నియమాలను పద్యాలలో పొందుపరచడం సాధ్యమయ్యిందని ఇతని రచనల ద్వారాతెలుస్తున్నది. కాలంనాటివాడని, కాదు
ఇతనిదని చెప్పబడుతున్న ఒక పద్యం

శ్రీలలనేశు డాంధ్రనృపశేఖరుడై చను రాజరాజభూ-
పలకుచేత బీఠపురి పార్శ్వమున న్నవఖండవాడ యన్
బ్రోలు విభూతితో బడసి భూరిజనస్తుతుడైన సత్కళా-
శీలుడ రాజపూజితుడ శివ్వన పుత్త్రుడ మల్లనాఖ్యుడన్ 


గోదావరి మండలంలో పావులూరు గ్రామానికి ఈ మల్లన్న కరణంగా ఉండేవాడట. ఇతడు మహావీరాచార్యులు రచించిన గణిత సార సంగ్రహాన్ని తెనిగించాడు. మూలం ఆ సంస్కృత గ్రంధం కావచ్చునుగాని లెక్కలన్నీ మల్లన్న స్వయంగా వేసుకొన్నవే. వ్యర్ధ పదాలు లేకుండా ఇంపైన పద్యాలలో శాస్త్రగ్రంధాన్ని ఇమడ్చడం ఇతని ప్రతిభకు సూచిక. ఇతని రచనలో కవిస్తుతి, పరిచయం వంటివి లేవు. ఇందులో ఒక పద్యం. 

చెలికి షడంశమున్ బ్రియకు శేషము లోపలఁ పంచమాంశమున్
బొలుపుగ దాని శేషమున బోదకు నాల్గవపాలునిచ్చి యం
దులఁ దన పాలు దాఁ గొనిపోయెఁ దొమ్మిది చేనలు రాజహంసమీ
నలిన మృణాళమెంత సుజనస్తుత మాకెఱుఁగంగఁ జెప్పవే

మల్లన్న వ్రాసిన ఈ క్రింది పద్యం వల్ల అప్పుడు జనం తర్క, వ్యాకరణ, గణిత, ఖగోళ, భూగోళ విషయాలలో ఆసక్తి కలిగి ఉండేవారని తెలుస్తున్నది.


అర్కాది గ్రహ సంచర గ్రహణ కాలాన్వేషణోపాయమునన్
దర్క వ్యాకరణాగమాది బహుశాస్త్రప్రోక్త నానార్ధ సం
పర్కాది వ్వవహారమునన్ భువనరూపద్వీప విస్తారమున్
దర్కింపగన్ గణిత ప్రవృత్తి వెలిగా దక్కొండెరింగించునే?
విజ్ఞాన శాస్త్ర పఠనానికి గణితం చాలా ముఖ్యమనే విషయం ఈ పద్యంలో తెలియజెప్పబడింది.
Read more...

Sunday 12 June 2011

హనుమాన్‌ చాలీసా పుట్టుక

2 comments


తులసీదాసు రామభక్తుడు. నిరంతరం రామనామస్మరణలో, రామనామగానంలో మునిగి, బ్రహ్మానందం పొందేవాడు. ఆయనే కాదు, ఆ గానామృతానికి పరవశించిపోయిన అనేకమంది, తులసీదాస్‌ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకుని, నిరంతరం శ్రీరాముని స్మరిస్తూ ఆనందంలో ఓలలాడేవారు. కేవలం హిందువులే కాదు, ఇతర మతాలవారు కూడా తులసీదాస్‌ వద్ద రామనామ దీక్ష తీసుకోవడం, రామ భజన చేయడం ప్రారంభించారు. ఇది సహజంగానే ఆయా మతగురువులకు ఆగ్రహం తెప్పించింది. మతచాందసవాదులు కొందరు, కబీరు మా మతాన్ని కించపరచి, మతమార్పిడులకు పాల్పడుతున్నాడని పాదుషాకి నేరారోపణ పత్రాలు సమర్పించారు. ఆపరిస్థితులలోనే ఒక సంఘటన జరిగింది.
ఒకరికొకరుగా జీవించే చిలకాగోరింకల్లాంటి జంట ఒకటి ఉంది. అతను హఠాత్తుగా కన్నుమూశాడు. అతని భార్య దుఃఖం వర్ణనాతీతం. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, శోకమూర్తిలా ఉన్న ఆమెను చూసి అందరికీ మనసు అర్ద్రమైంది. కానీ ఎవరు మాత్రం ఏం చేయగలరు! పోయిన ప్రాణం తెప్పించే శక్తి ఎవరికి ఉంది!
అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. భర్తశవాన్ని తీసుకుపోనీయకుండా అడ్డుకుంటున్న ఆ అమ్మాయిని బంధుమిత్రులు కలిసి బలవంతంగా ఆపగా, శవయాత్ర ముందుకు నడిచింది. కానీ, కొద్దిసేపటికే ఆ అమ్మాయి పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగుపరుగున శవయాత్రసాగే ప్రదేశానికి చేరుకుంది. అప్పటికి ఆ శవయాత్ర తులసీదాస్‌ ఆశ్రమం ముందునుంచి వెళుతోంది. ఆ ఆశ్రమము చూడగానే, ఆమెకు ఏమనిపించిందో! తన భర్తని బ్రతికించగల మహానుభావుడు అక్కడ ఉన్నాడనుకుందేమో! ఆ ఆశ్రమములోని భక్తుడు శ్రీరామచంద్రుని అనుగ్రహమువల్ల తన శోకం రూపుమాపగలడనుకున్నదేమో! ఏమనుకుందో ఏమోగాని, ఆ అమ్మాయి హఠాత్తుగా ఆ ఆశ్రమములోనికి వెళ్ళి, తులసీదాస్‌ పాదాలమీద వాలి శోకించింది.
నుదుటబొట్టు, చేతులకు గాజులు మొదలైన సౌభాగ్య చిహ్నాలతో ఉన్న ఆమెను చూసిన తులసిదాస్‌, దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. ఆ దేవెనకి ఆమె మరింతగా శోకించింది. సౌభాగ్యవతీ! ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. కారణం చెప్పమ్మా! అని అనునయంగా పలికాడు తులసిదాస్‌‌. నాబోటి నిర్భాగ్యురాలిని - దీర్ఘసుమంగళీభవ అని దీవించారు స్వామీ! మీబోటి మహానుభావుల దేవెన నిష్పలమైంది కదా! అంటూ కుమిలి పోయింది ఆ ఇల్లాలు. శ్రీరామచంద్రుడు నానోట అసత్యం పలికించడమ్మాఅ! ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు తులసీదాస్‌. మా ఆయన చనిపోయారు. ఆ వెళుతున్న శవయాత్ర ఆయనదే. ఇక నా సౌభాగ్యమునకు అర్థమేముంది అంటూ భోరుమంది ఆ అమ్మాయి. తులసిదాసు హృదయము జాలితో నిండిపోయింది. ఆయన వెంటనే ఆ శవయాత్ర దగ్గరకు వెళ్ళి, శవవాహకులను ఆగమన్నాడు. వారు ఆగిపోయారు. ఆ శవం కట్లు విప్పి, ఆ రామభక్తుడు రామనామాన్ని జపించి, తన కమండలములోని జలాన్ని శవంమీద జల్లాడు.
అంతే! అద్భుతం జరిగింది. శవంలో జీవం వచ్చింది. అటూ ఇటూ కదిలి కళ్ళు తెరిచాడు. చైతన్యవంతమైన అతనిని చూసిన ఆతని భార్య ఆనందబాష్పాలు రాలుస్తూ, తులసీదాసు పాదాలపై వాలిపోయింది. బంధుమిత్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఈ సంఘటన తర్వాత రామనామదీక్ష తీసుకునేవారి సంఖ్య అమితంగా పెరిగిపోయింది. దీంతో ఇతర మతగురువులు డిల్లీ పాదుషావారి దగ్గరికి వెళ్ళి, తులసీదాసు మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నాడని అభియోగం మోపారు. విచారించడానికై తులసీదాసుని పిలిపించాడు పాదుషా. వారి మధ్య జరిగిన సంఘటనలో, రామనామం ఎంతో శక్తివంతమైనదని, రామనామస్మరణ ద్వారా దేనినైనా సాధించవచ్చని చెప్పాడు తులసీదాసు. మరణించినవారిని బ్రతికించగలదా మీ రామనామం అని అడిగాడు పాదుషా. తప్పకుండా అని జవాబిచ్చాడు తులసీదాసు. మేము ఇప్పుడే ఒక శవాన్ని తెప్పిస్తాము. మీ రామనామ మహిమతో బ్రతికించగలరా అని సవాలు చేశాడు పాదుషా. రామనామం చాలా మహిమ కలది. చనిపోయిన వ్యక్తిని బతికించగలదు. కానీ జననమరణాలు వ్యక్తి కర్మలమీద, దైవనిర్ణయం మీద ఆధారపడి ఉంటాయు. వాటి విషయం మానవమాత్రులమైన మనం కలిగించుకోవడం తప్పు కదా! అన్నాడు తులసీదాసు. ఇన్ని మాటలు వద్దు. రామనామానికి మహిమ లేదని చెప్పు. లేదా శవాన్ని బతికించు. అంతే అని కఠినంగా ఆజ్ఞాపించాడు పాదుషా.
రామచంద్రా! ఇదేమి పరీక్ష! రాజు కన్నెర్ర చేస్తున్నాడు. అంత మాత్రాన ఇతను చెప్పిన పని చేయలేను కదా! రామా! ఈ విపత్తు నుండి నీవే నన్ను రక్షించాలి రామా! అని మనసులోనే వేడుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నుడైయ్యాడు తులసీదాసు. సమాధానం చెప్పకపోవడం, కళ్ళు మూసుకుని ఉండటం, కనీసం తన తప్పు కాయమనుకోవకపోవడం, శరణు వేడకపోవడం, ఇవన్నీ పాదుషాకి కోపం తెప్పించాయి. తులసీదాస్‌ని బంధించమని ఆజ్ఞాపించాడు. తులసీదాసు వైపు సైనికులు కదిలారు. మనసా, వాచా, కర్మణా - త్రికరణశుద్ధిగా తననే నమ్మే ఆ భక్తునికి , ప్రతిక్షణం రామనామస్మరణ చేసే తన సేవకునికి, ప్రాణపాయసమయంలో కూడా తన మీదే భారం వేసిన ఆ మహానుభావునికి అపాయం చుట్టుముడుతుంటే రామభద్రుడు ఊరుకుంటాడా! తక్షణమే తన సైన్యాన్ని పంపించాడు.
ఎక్కడినుండి వచ్చాయో తెలియదు గానీ, వందలు, వేలుగా కోతులు అక్కడికి వచ్చాయి. సైనికులమీద పడి, వారి దగ్గర ఆయుధాలను గుంజుకుని వారిమీదకే గురిపెట్టాయి. సభికులు, సైనికులు, పాదుషా, ఎవ్వరూ కదలలేదు. ఏ కోతి మీదపడి కరుస్తుందో అనే భయంతో సభికులు భయాందోళనలకు గురయ్యారు. సభలో కలకలం రేగింది. ఆ సవ్వడికి కనులు తెరచిన తులసీదాసుకి సైనికులకి ఆయుధాలు గురిపెట్టిన వానరాలు కనిపించాయి. అవి కోతులు కాదు, రామదండు. తులసీదాసు ఆశ్చర్యంతో, ఆనందంతో చుట్టూ పరికించాడు. ఎదురుగా సింహద్వారం మీద కూర్చొని అభయహస్తాన్ని చూపుతున్న ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. తులసీదాసు భక్తిభావంతో తన్మయుడయి, స్వామికి చేతులు జోడించి స్తుతించాడు. ఆయన నోటినుండి అప్రయత్నంగా, ఆశువుగా జయహనుమాన జ్ఞానగుణసాగర అంటూ హనుమాన్‌ స్తుతి ప్రవహించింది. అదే హనుమాన్‌ చాలీసా.
తులసీదాసు స్తుతికి హనుమంతుడు ప్రసన్నుడయి, ఆ భక్తుని అనుగ్రహించాడు. నాయనా! నీస్తుతితో మరింత ప్రసన్నం చేసుకున్నావు. బిడ్డా! ఈ మూకని సంహరించాలా? తరిమికొట్టాలా? నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అని అన్నాడు స్వామి.
చేతులు జోడించి భక్తిగా తలవాల్చాడు తులసీదాసు. స్వామీ! ఇప్పటికే ప్రాణాలరచేతిలో పెట్టుకున్న వీరిగురించి నేనేమీ అడగను. ఇప్పటికే వీరికి అజ్ఞానం తొలగిపోయింది. కానీ, ఒక్క ప్రార్థన. ప్రభూ! ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు స్తుతించినా వారికి ప్రసన్నుడ వవు స్వామీ! నాకు ఈ వరాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ మాటలకు స్వామి మరింత ప్రసన్నుడయ్యాడు. తథాస్తు అని అనుగ్రహించాడు.

నాటి నుంచి హనుమాన్‌ చాలీసా చదివిన వారికి స్వామి ప్రసన్నుడయి అనుగ్రహిస్తున్నాడు. 
                      || జయ హనుమాన్ ||
Read more...

త్రైలింగస్వామి

0 comments

త్రైలింగస్వామి 1601వ సంవత్సరం లో ఆంధ్రదేశం లో జన్మించి సుమారు 280 సంవత్సరాలు జీవించిన మహాత్ముడు. వీరి తల్లిదండ్రులు నరసింగరావ్, విద్యావతి. స్వామి శివుడి అవతారంగా చెప్పబడ్డాడు.


ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం. స్వామి చిన్నప్పటినుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు. తన తల్లి చెప్పే రామాయణ, మహాభారతాలు మొదలైన మతగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు. ఇతను తన తల్లిదండ్రుల సేవలో 52 సంవత్సరాలు గడిపాడు. అప్పుడు తన తల్లి మరణించగా గురువును వెదుకుతూ ఇల్లు వదలిపెట్టి వెళ్ళిపోయాడు. తన సాధనను తన ఊరి శ్మశానంలో ప్రారంభించాడు. తర్వాత అతను నేపాల్ తో సహా చాలా ప్రదేశాలు తిరిగి చివరికి కాశి  చేరుకొని అక్కడ సుమారు 150 సంవత్సరాలు పైన ఉన్నాడు.


స్వామివారు కేవలం ఆకులూ అలములు, పండ్లు ఫలాలు తిని సంవత్సరానికి ఒక పౌండు చొప్పున పెరిగి 300 పౌండ్ల బరువుకి పెరిగినట్టు చెపుతారు. స్వామివారు ఎన్నో విషపూరిత ద్రవాలు త్రాగికూడా ఎటువంటి తేడా లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. వేలాది ప్రజల సాక్షిగా రోజుల తరబడి గంగానది పై తేలుతూ ఉండేవారు. ఒక్కొక్క సారి నీటిపై కూర్చుని ప్రజలకు కనిపించేవారు. ఒక్కొక్కసారి నీటిలోపల, అలల క్రింద రోజుల తరబడి ఉండిపొయేవాడు. వేసవికాలం లో మిట్టమధ్యాహ్నం మణికర్ణికా ఘాట్ లో ఎర్రగా కాలే ఇసుక పై స్వామి పడుకోవడం, స్వామికి ఏమీ కాకుండా ఉండటం చూడటం అక్కడి ప్రజలకు అలవాటే.


స్వామి అద్వైత ఙ్ఞానసిద్ది పొందారనడానికి క్రింది సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. ఆయన విషపూరిత ద్రవాలు త్రాగి కూడా ఏమీకాకుండాఉండడం చూసి ఒక వ్యక్తి స్వామి అబద్దాలకోరు అని ఋజువు చేయడానికి ఒకరోజు ఒక కుండ నిండా సున్నం తీసుకుని స్వామివారికి అందులో పెరుగు ఉందని చెప్పి ఇచ్చాడు. సర్వజ్ఞులైన స్వామివారు మారుమాటాడకుండా త్రాగినారు. త్రాగిన వెంటనే ఇచ్చిన అతను కడుపులో మంట అంటూ పొర్లాడసాగాడు. స్వామివారిని కరుణించమన్నాడు. అప్పటికి ఎన్నోరోజుల నుండి మౌనంలో ఉన్న స్వామి తన మౌనం విరమించి "ఓయి ధూర్తుడా! సర్వ ప్రాణులలో ఉన్న ఆ పరబ్రహ్మమే నా కడుపులో కూడా ఉన్నాడన్న జ్ఞానం నాకు ఉంది కాబట్టే నేను నీవిచ్చిన విషపూరిత సున్నం త్రాగి కూడా బ్రతికినాను. ఇంకెప్పుడు ఇలా చేయవద్దు. వెళ్ళీపో" అన్నాడు. ఆ ఇచ్చిన వ్యక్తి బ్రతుకుజీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు.


స్వామి వారు ఎప్పుడూ దిగంబరంగా ఉండేవారు. అప్పటి ఆంగ్లేయులకు ఇది చాలా కష్టంగా ఉండేది. అందువలన ఎన్నోసార్లు స్వామిని పట్టుకొని కారాగారంలో పెట్టారు. కానీ స్వామివారిని పెట్టిన నిమిషం లోపే స్వామివారు కారాగారపు పైకప్పుల పైన పచార్లు చేస్తూ కనిపించేవారు. ఒక సారి స్వామివారిని న్యాయస్థానం లో హాజరుపరిచారు. అక్కడి న్యాయమూర్తి స్వామివారితో "మీరు అన్నిటిలో దేవున్ని చూస్తున్నారని చెప్పారు కదా. అలా ఐతే నీ మలం నీవే తినగలవా?" అని ప్రశ్నించాడు. స్వామివారు ఏ మాత్రం సంకోచించకుండా అక్కడే మలవిసర్జన చేసి తన మలం తనే తిన్నాడు. ఆశ్చర్యకరంగా స్వామివారి మలవిసర్జన తర్వాత న్యాయస్థానం అంతా సుగంధభరితం అయ్యింది. ఈ దెబ్బతో స్వామి వారిపై ఆంగ్లేయులు మరెప్పుడూ ఫిర్యాదు పెట్టలేకపోయారు. ఇలా స్వామివారి జీవితంలో ఎన్నో మహిమలు జరిగాయి.


స్వామివారు పుష్య శుద్ధ ఏకాదశి నాడు (డిసెంబర్ 1881) నాడు సమాధి పొందారు. వీరి సమాధి కాశి లో పంచగంగ ఘాట్ లో ఉంది.
Read more...

శివకేశవుల అభేదమును తెల్పు హరిహరనాధుని స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు

0 comments
శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్
Read more...

భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన

0 comments
శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె  వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై ||
శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో  చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే  చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి  వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు
Read more...

త్రిమూర్తులను వర్ణించు శ్లోకము

0 comments
రచన: నన్నయ్య 
 
శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ  శ్రీకంధరా శ్శ్రేయసే ||
Read more...

మనుచరిత్రలో సాయంకాల వర్ణన

0 comments
శా. శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు; లుష్ణాంశుపా
    షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా
    శోణం బయ్యెఁ బతంగ బింబము; దిశా స్తోమంబు శోభాదరి
    ద్రాణం బయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్ 

ఆంధ్ర కవితా పితామహుడిగా పేరుపొందిన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము లోని తృతీయాశ్వాసం లోనిది ఈ పద్యం. ఇందులో కవి సాయంకాలాన్ని వర్ణిస్తున్నాడు.


తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరిగిపోని పేర్లలో అల్లసాని పెద్దన పేరు చాలా ముఖ్యమైంది. కృష్ణదేవ రాయని ఆస్థానం లోని అష్టదిగ్గజాలనే తెలుగు కవుల్లో పెద్దన అగ్రగణ్యుడు. రాయలవారికి ఈయనంటే మహా గౌరవం. ఆ మహాకవి కూర్చున్న పల్లకీని తన చేతులతో స్వయంగా పట్టి ఎత్తించాడట. సత్కార పూర్వకంగా ఇచ్చే గండపెండేరాన్ని తానే స్వయంగా కవి కాలికి తొడిగాడట. అదీ ఆ రాజప్రభువు సంస్కారం. అలాగే, పెద్దనకి రాయల వారంటే ప్రాణం. రాయలు మరణించినప్పుడు ఆయనతో తనూ పోలేక జీవచ్చవంలా బ్రతుకుతున్నానే అని వాపోయాడట.


‘మను చరిత్రము’ పెద్దన రచించిన ఒకే ఒక ప్రబంధ కావ్యం. దీనికే స్వారోచిష మనుసంభవమనే పేరు కూడా ఉంది. మార్కండేయ పురాణం లోని ఒక చిన్న కథను తీసుకొని, దాన్ని విస్తరించీ ప్రస్తరించీ ఒక అపూర్వ కళాఖండాన్ని శిల్పించాడు పెద్దన. ఇది నిజంగా అపూర్వమే. పెద్దనకు పూర్వం తెలుగులో అంత ఖచ్చితమైన ప్రమాణాలతో రచింపబడిన కావ్యం లేదు. పెద్దన తర్వాత కవుల్లో కూడా మనుచరిత్రమును అనుకరించి రాయబడిన కావ్యాలే ఎక్కువ. తిమ్మన, ధూర్జటి లాంటి ఒకరిద్దరు కవులు సమగ్రమైన కావ్యాలు వ్రాసినా, వారంతా పెద్దన తర్వాత పేర్కొనవలసిన వారే. మనుచరిత్రమును పెద్దన గారి “సకలోహ వైభవ సనాధము” అనవల్సిందే. కొద్దో గొప్పో సాహిత్యజ్ఞానం ఉన్నవారికి మనుచరిత్రం లోని చాలా పద్యాలు కంఠతా ఉంటాయనేది అతిశయోక్తి కాదు.
పూర్వం, కాశీ దగ్గర ఒక ఊళ్ళో ప్రవరుడనే నైష్టిక బ్రాహ్మణుడు ఉంటుండే వాడు. ఒకరోజు అతని ఇంటికి విచ్చేసిన ఒక సిద్ధుడు ఇచ్చిన పసరు కాళ్ళకు పూసుకొని, దాని ప్రభావంతో తాను చూడాలనుకున్న హిమాలయ పర్వతాలకు పోతాడు. చూడదలచుకున్న ప్రదేశాలన్నీ చూశాక, తిరిగి ఇంటికి పోదలచుకునేటప్పటికి పసరు కరిగిపోయి ఉంటుంది. ఇక చేసేది లేక అక్కడే కొండల్లో తిరుగాడుతున్న ప్రవరుడికి వరూధిని అనే అప్సరస కంపిస్తుంది. వరూధిని అతణ్ణి మోహించినా, ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోతాడు. దిగులుతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకుంటాడు. అలా పుట్టిన స్వరోచి, ఒక దేశానికి రాజు కావడమూ, వేట కెళ్ళినపుడు మనోరమ అనే యువతిని రక్షించి పెళ్ళాడడమూ, వారికి పుట్టిన కొడుకు స్వారోచిష మనువుగా పేరు పొందటమూ - ఇదీ, టూకీగా మనుచరిత్రము లేదా స్వారోచిష మనుసంభవం కథ.
కథా సంవిధానంలో గానీ, పాత్రల చిత్రణలో గానీ, సన్నివేశాలు కల్పించి సంభాషణలు నిర్వహించడంలో గానీ, పద్య నిర్వహణంలో గానీ దీనికి సాటి ఐన గ్రంధం నభూతో నభవిష్యతి అనీ అనిపించుకున్న కావ్యం ఈ మను చరిత్రము. అరుణాస్పదపురంలో ప్రవరుని గైహిక జీవనం, హిమాలయ ప్రాంతాల ప్రకృతి వర్ణన, వరూధినీ ప్రవరుల వాదోపవాదాలు గానీ, ఆమె దిగులు, ఆ తర్వాత ప్రకృతి వర్ణనా, స్వరోచి మృగయా వినోదం గానీ, ఎవరు ఎంతగా వర్ణించి చెప్పినా, రసజ్ఞుడైన పాఠకుడు, స్వయంగా చదివి అనుభవించే ఆనందం ముందు దిగదుడుపే.
ప్రవరుడు నిరాకరించి వెళ్ళిపోయిన తర్వాత, వరూధిని దిగులు పడుతూ వుండగా సాయంకాల మవుతుంది. ఆ సాయంసమయాన్ని వర్ణిస్తూ కొన్ని పద్యాలూ, తరువాత చీకటిని వర్ణిస్తూ కొన్ని పద్యాలూ వున్నాయి. ఒక పద్యంలో - తనను కోరివచ్చిన ‘అనన్య కాంత’ను అహంకారంతో నిరాకరించి వెళ్ళిపోయిన దుష్ట బ్రాహ్మణుడి మీద సూర్యుడికి కూడా కోపమొచ్చిందేమో అన్నట్లు - సూర్య బింబం కాషాయవర్ణం దాల్చిందట (చూశారా, పెద్దన గారికి కూడా వరూధిని మీదే సానుభూతి). నిజానికి, వరూధిని ప్రవరుడిని మోహించి, వాదోపవాదాలు చేసి, ఆఖరున మీద పడబోయిన ఆమెను చూసి, ఏమిరా, ఎంత నిస్సిగ్గుగా ప్రవర్తించిందీ దేవకన్య! అన్న జుగుప్స కలగదు. పైగా, ఆమె చతురత, వాదనా పటిమ, హొయలూ, పాఠకుణ్ణి మెప్పిస్తాయి కూడానూ. అదీ పెద్దన నిర్వహణ తీరు!
సాయంకాల వర్ణన చేసిన పద్యం అని కదా చెప్పుకున్నాం. సాయంసమయాన్ని వర్ణిస్తూ అనేకమైన పద్యాలు ఉన్నా, ఇంత సహజ సుందరంగా, స్వభావోక్తిగా చేసిన పద్యం -దీనిని మించినది ఇంకొకటి లేదు. గొప్ప భావనా బలంతో, గొప్ప గొప్ప ఉత్ప్రేక్షలు గుప్పించిన పద్యాలున్నాయి గానీ, ఇంత నిసర్గమైన అందం గలిగిన పద్యం మరొకటి లేదు. ఇంతెందుకు? పెద్దనే, ఈ సందర్భంలోనే, చేసిన వర్ణన ఇంకొకటి ఉంది - “రవిబింబ పతన దీర్ణత పయోధీ గర్భ నిర్గత శేష ఫణి ఫణా రత్న రుచియొ…” - అని. సూర్యుడు పడమటి సముద్రంలో గ్రుంకగానే, ఆ దిక్కు ఆకాశపు కావి రంగు, కలగుండు పడగానే సముద్రపు అడుగునుంచి తల పైకెత్తిన ఆదిశేషుడి పడగల మీది మణుల మెరుపు లాగా, ఉందట. భావన చాలా దూరం పోయింది, వాస్తవం నుంచి దూరంగా. మరి, పైన చెప్పుకున్న పద్యం చూడండి.
సాయంకాలం అయ్యేసరికి ఆకాశంలో బారులు బారులుగా ఇంటిముఖం పట్టిన పక్షులూ, పగటి వేడి తగ్గగానే చల్లబడిన సూర్యకాంత శిలలూ, ఎండతో పాటే మాయమైపోయిన ఎండమావులూ, కాషాయ వర్ణం నింపుకున్న సూర్య బింబమూ, కాంతిని కోల్పోయిన దిక్కులూ, కొలనులో ముడుచుకొని పోతున్న తామరలూ - ఎంత సహజ సుందరమైన సంధ్యా సమయ వర్ణనో చూడండి. సాయంకాలాన్ని ఒక అద్భుతమైన చిత్రపటంలా మన కళ్ళ ముందు నిలిపాడు గదా, కవి.


కేవలం వర్ణనే కాదు, పద్యం నిర్వహించిన తీరు మాత్రం! ‘ణ’ ప్రాసను ఎంచుకొని, గొప్ప ధారను సాధించడానికి ‘ణ’కార పునరావృత్తిగా ఉష్ణాంశు, కోష్ణము, మృగతృష్ణ, నిద్రాణము, దరిద్రాణము, లాంటి పదాలను దట్టించి చెవులకు ఇంపైన సంగీత ధోరణి కల్పించాడు. అను నాసికా వర్ణాల పౌనః పుణ్యంతో, హాయిగా సాగే ధారతో, కండ్ల ఎదుట దృశ్యమానమయే నైసర్గిక సౌందర్యంతో, ఒక మరిచిపోలేని పద్యంగా నిలిచిపోయింది, ఈ పద్యం. వస్తు సౌందర్యమూ, వర్ణనా సౌందర్యమూ రెండూ కలిసిపోయి పుట్టిన ఇంకో సౌందర్యం - ఈ పద్యం. అందుకే, ఇది నాకు నచ్చిన పద్యం.
 
Read more...

Tuesday 7 June 2011

వెయ్యేళ్ళ తెలుగు పద్యం.

0 comments
మ.
హరిదంభోరుహలోచన ల్గగనరంగాభోగరంగ త్తమో
భర నేపథ్యము నొయ్య నొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్
వరుసన్ మౌక్తికపట్టమున్, నిటలమున్, వక్తంబునుం దోఁచె నా
హరిణాంకాకృతి వొల్చె రే కయి, సగం బై, బింబ మై తూర్పునన్.


ఇది వసు చరిత్రలో రామరాజ భూషణుని చంద్రోదయ వర్ణన.


వెయ్యేళ్ళ తెలుగు పద్యం పేరుమీదుగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో (1980 దశకంలో ) కీ.శే. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు నిర్వహించిన శీర్షికలోని తొట్టతొలి పద్యం.


గగనరంగ మనే విశాల రంగస్థలం మీద రాత్రి అనే నట్టువకత్తె చూపించబోయే నాట్య ప్రదర్శనకు ముందుగా పద్మలోచనలు తాము పట్టుకున్న చీకటి అనే తెఱను మెల్లమెల్లగా సడలిస్తుండగా రాత్రి అనే నట్టువకత్తెకు వరుసగా ముందు మౌక్తిక పట్టము, తఱువాత నుదుటి భాగము ఆ తఱువాత నిండుముఖమూ కనిపించినట్లుగా మొదట ఒక వంకర రేక గాను తఱువాత సగ భాగముగాను తఱువాత పూర్ణబింబమూ గాను తూర్పున ఉదయిస్తూన్న ( లేడిని తనయందు గలిగి ఉన్న) చందమామ కనిపించినదట. ఎంత మనోహర వర్ణన !
 
Read more...

Monday 6 June 2011

నవగ్రహ ధ్యాన శ్లోకములు

0 comments

శ్లో|| ఆరోగ్యం పద్మబన్ధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి:
     భూలాభం భూమిపుత్రస్సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య: |
     సౌభాగ్యం దేవమన్త్రీ రిపుభయశమనం భార్గవశ్శౌర్యమార్కి:
     దీర్ఘాయుస్సైంహికేయో విపులతరయశ: కేతురాచంద్రతారం ||

శ్లో|| అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |
      శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం ||


Read more...