Friday 24 June 2011

ఈ అయిదు అమ్మవారి ప్రధానరూపాలు .

0 comments
శ్రీకృష్ణున్ని అవతరింపజేయటం కోసం లోకజనని అయిదురూపాలు ధరించింది . ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక బేధాలున్నాయి .భక్తులను అనుగ్రహించటం కోసం ,తన బిడ్డలైన వారి అభ్యర్దన మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది అమ్మ. అయితే మూలప్రకృతినుంచి ఆవిర్భవించిన రూపాలు ప్రధానమైనవి మాత్రం ఇవి






వాటిలో మొదటిరూపం శివప్రియ,గణేశమాతదుర్గ. శివరూప ,విష్ణుమాయ ,నారాయణి,పూర్ణబ్రహ్మ స్వరూపిణి ,సర్వాధిష్టాత్రి ,శర్వ రూప ,సనాతని,ధర్మసత్య,పుణ్యకీర్తి.యశోమంగళ దాయిని, సుఖమోక్ష,హర్ష ధాత్రి ,శోఖార్తి దు:ఖనాశిని ,శరణాగత దీనార్తపరిత్రాణపరాయణ ,తేజ:స్వరూప ,సర్వశక్తి స్వరూప ,సిద్ధేశ్వరి ,సిధ్ధరూప .సిద్ధిద ,బుద్ధి,నిద్ర క్షుత్తు,పిపాస ,చాయ,తంద్ర,దయ,స్మృతి ,జాతి,క్షామ్తి,భ్రాంతి,శాంతి,చేతన,తుష్టి ,పుష్టి లక్ష్మీ,ధృతి ,మాయ -----ఇత్యాది నామాలతో కీర్తింపబడుతుంది

.




ఇక రెండవది శుధ్ధ శక్తి స్వరూప మహాలక్ష్మి . సర్వ సంపత్స్వరూప .సంపదధిష్టాత్రి ,పద్మ,కాంత ,దాంత, శాంత.సుశీల,సర్వ మంగళ,లోభకామ మోహ మదహంకార వివర్జిత భక్తానురక్త ,పతివ్రత, భగవత్ప్రాణతుల్య, భగవత్ ప్రేమపాత్ర ,ప్రియంవద ,సర్వాత్మిక , జీవనోపాయరూపిణి. వైకుంఠం లో ఈ మహాలక్ష్మి పతిసేవాపరాయణయై నివసిస్తూ ఉంటుంది . సర్వప్రాణి కోటిలోనూ శోభారూపంగా ఉంటుంది . స్వర్గం లో స్వర్గ లక్ష్మిగా ,రాజులలో రాజ్య లక్ష్మిగా,గృహాలలో గృహలక్ష్మిగా విరాజిల్లుతుంటుంది . పుణ్యాత్ములకు కీర్తిరూప ,నరేంద్రులకు ప్రభావరూప ,వైశ్యులకు వాణిజ్యరూప,పాపాత్ములకు కలహాంకురరూప .వేదాలలో హయరూపంగా వర్ణింపబడినది సర్వపూజ్య,సర్వ వంద్య.


ఇక మూడవరూపం వాగ్బుధ్ధివిద్యాజ్ఞానాధిష్టాత్రియైన సరస్వతి .సర్వవిద్యాస్వరూప ,బుధ్ధి కవిత,మేధ,ప్రతిభ,స్మృతి ,ఇత్యాదులన్నీ మానవులకుఈవిడ దయవలనే కలుగుతున్నాయి. సిధ్ధాంత బేధాలు అర్ధబేధాలు కల్పించేది ఈతల్లే .ఈవిడే .వ్యాఖ్యాస్వరూపిణి ,బోధస్వరూపిణి సర్వ సందేహ భంజని .విచారకారిణి ,గ్రంథ కారిణి,శక్తిరూపిణి,.సర్వసంగీత సంధాన తాళ కారణ రూపిణి ,విషయ జ్ఞాన వాగ్రూప ,ప్రతివిశ్వోపజీవని ,వ్యాఖ్యావాదకరి,శాంత .వీణాపుస్తకధారిణి ,శుద్ధసత్వరూప ,సుశీల,శ్రీహరిప్రియ,,హిమ,చందన.కుంద,ఇందు,కుముద,అంభోజసన్నిభ . రత్న జపమాలికతో శ్రీకృష్ణున్ని ధ్యానించే తప:స్వరూపిణి .తప:ఫలప్రద .సిద్ధవిద్యాస్వరూప .సర్వసిధ్ధి ప్రద . ఈ తల్లి లేకుంటే సర్వజనులు మూగవారవుతారు .



ఇక నాల్గవరూపం చతుర్వర్ణాలకు చతుర్వేదాలకు వేదాంగాలకు అధిష్టానదేవత . సంధ్యావందనమంత్రతంత్ర స్వరూపిణి,ద్విజాతిజాతిరూప ,తపస్విని,జపరూప,బ్రహ్మణ్యతేజోరూప సర్వసంస్కారరూపిణి ,సావిత్రి,గాయత్రి ,బ్రహ్మప్రియ . ఆత్మశుద్ధికోసం సర్వతీర్ధాలు ఈతల్లి సంస్పర్షను కోరుకుంటాయి. శుధ్ధస్పటికవర్ణ,శుధ్ధ స్వరూపిణి పరమానంద ,పరమ,సనాతని పర బ్రహ్మస్వరూపిణి నిర్వాణప్రదాయిని బ్రహ్మతేజోమయి ,ఈతల్లి పాదధూళిసోకి జగత్తు పునీతమవుతున్నది.

ఇక అయిదవ రూపాన్ని వర్ణిస్తున్నాను నారదా! ఆలకించు.




అయిదవరూపం . పంచప్రాణాలకు అధిష్టానదేవత . పంచ ప్రాణ స్వరూపిణి ,ప్రాణాధికప్రియతమ ,అందరికన్నా అందగత్తె .సౌభాగ్యమానిని గౌరవాన్విత ,వామాంగార్ధస్వరూప ,తేజోగుణసమన్విత . పరాపరసారభూత ,పరమ. ఆద్య.సనాతని పరమానందరూపిణి ,,ధన్య,మాన్య,,పూజ్య, శ్రీకృష్ణునికి రాసక్రీఢాధిదేవత ,రాసమండల సంభూత,రాసమండల మండిత,రాసేశ్వరి,సురసిక ,రాసావాస నివాసిని ,గోలోకవాసిని ,గోపీవేషవిధాయక.పరమాహ్లాదరూప .సంతోష హర్షరూపిణి ,,నిర్గుణ, నిరాకార, నిర్లిప్త,ఆత్మస్వరూపిణి ,నిరీహ, నిరహంకార. భక్తానుగ్రహ నిగ్రహ ,విచక్షణులు వేదానుసార జ్ఞానం తో ఈవిడను తెలుసుకుంటారు .సురేంద్రమునీంద్రాదులైనా చర్మచక్షువులతో ఈవిడను చూడలేరు . వహ్నిలాంటి అంశుకాన్ని ధరించి ఉంటుంది . నానాలంకార విభూషిత .కోటిచంద్రప్రభ .పుష్టిసర్వశ్రీయుక్తవిగ్రహ. శ్రీకృష్ణుని పట్లభక్తితో దాస్యం చేస్తూ ఉంటుంది . వరాహావతారకాలంలో ఈవిడ వృషభానునిఇంట కూతురుగా ఉద్భవించింది .
ఈ తల్లి పాదస్పర్షతో వసుంధర పావనమయ్యింది. శ్రీకృష్ణుని వక్షస్థలం లో నివసిస్తూ నీలమేఘావృతమైన ఆకాశం లో మెరుపుతీగలా భాసిస్తున్నది.
ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలిగోటిని సందర్శించి తనను తాను శుద్ధిచేసుకుందామని ఆశించి అరవైవేల దివ్యసంవత్సరాలు తపస్సుచేసినా ఫలితం దక్కలేదు. కనీసం కలలోనైనా దర్శనం కాలేదు. అతడికి అలాదొరకని సందర్శన భాగ్యం భూలోకంలో లభించింది .బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది . ఈరాధ దేవీ పంచమరూపం


నారదా ! స్రుష్టిలో కనిపించే ప్రతిస్త్రీలోనూ దేవీరూపం కళారూపంగానో,కాలరూపంగానో,అంశరూపంగానో కళాశాంశారూపంగానో ఉంటూనే ఉంటుంది .స్త్రీలందరూ దేవీ స్వరూపాలే . పరిపూర్ణ స్వరూపాలు మాత్రం ఈ అయిదే.  [ దేవీ భాగవతం నుండి ]

0 comments:

Post a Comment