Thursday 1 March 2012

కాశీఖండం

0 comments
శ్లో: "దర్శనాత్ అబ్రసదసి జననాత్ కమలాలయే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః"



భావం: చిదంబరం లో శివదర్శనం, తిరువాయూర్ లో జననం, అరుణాచలేశ్వరుని స్మరణం, లేదా కాశీలో మరణం ముక్తి కారకములు.

కాశీలో మరణించిన వారికి ముక్తిని ప్రసాదిస్తానని తాను చేసిన ప్రతిజ్ఞని పరమేశ్వరుడు ఎలా నెరవేర్చుకుంటాడో శ్రీనాధ కవిసార్వభౌముడు కాశీఖండంలో తెలియచేసిన పద్యం:



పద్యం: పాలిండ్లు కదలంగా పసిడి పైయెద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ,
ధుఃకారమొనరించు తొండంబు ముక్కున శిఖరారావము జిలుకు డుంఠి,
ప్రత్యక్షమైవచ్చి భాగీరధీ గంగ మృదుల హస్తంబు చాచి మేను నిమురు,
ప్రధమోత్తముండు భృంగి భయరక్షణార్ధంబు ఫాలాగ్రమున దీర్చు భసిత రేఖ,
దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్లి, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ,
పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవుడుపదేశమొనరించు కాశి!

భావం: ఊపిరి అందక మరణావస్థలో ఉన్న జీవుడు ప్రాణోత్క్ర్కమణం అవుతున్నవేళ:
1. చక్కటి సువాసనలు వెదచల్లుతూ, గాజుల, కాలియందెల చప్పుడు వినిపిస్తుండగా పర్వత రాజపుత్రి అయిన పార్వతి దేవి వచ్చి జీవుడి తలను తన ఒడిలో పెట్టుకుని తన పవిటతో గాలి వీచేసరికి జీవుడు స్వాంతన పొందుతాడు. 
2. డుంఠి గణపతి వచ్చి ఎగఊపిరి తీస్తున్న జీవుడికి తన చల్లటి తొండంతో ముక్కు దగ్గర నిమురుతాడు.
3. ఇక దేహం విడిచిపెట్టేస్తున్నాను అనే భయంతో వేడెక్కిపోయిన జీవుడి శరీరాన్ని తన చల్లటి చేతులతో గంగమ్మ నిమిరేసరికి హాయిని పొందుతాడు.
4. ప్రమధ గణములలో ఉత్తముడైన భృంగి జీవుడి నుదుటిపైన ఇక భయపడవద్దని విభూది పెడతాడు.
5. చక్కటి సువాసనలు వెదజల్లుతుండగా, గణ గణ గంటల ధ్వనులు వినిపిస్తుండగా, సాక్షాత్తూ కాశీ విశ్వనాధుడే వచ్చి జీవుడి పక్కన కూర్చుని, ముందుకి వంగి జీవుడి కుడి చెవిలో తారకాన్ని ఉపదేశించగా, జీవుడు తారక మంత్రాన్ని ఉచ్ఛరిస్తాడు. మరణ సమయంలో తారకాన్ని పలికేవు అన్న మిషతో ఆ జీవుడిని తనలో ఐక్యం చేసుకుంటాడు.

జ్ఞానదృష్టితో చూసిన యోగులకు అక్కడ మరణించిన క్రిమి కీటకాదులనుంచి సైతం కుడిచెవి మీదకి పెట్టి మరణించటాన్ని దర్శించేరుట. అంత పవిత్రమైన కాశీకి వెళ్ళే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో??

0 comments:

Post a Comment