Friday 2 January 2015

గోపూజ- గోవిశిష్టత

1 comments


శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలకుడైనాడు. ‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః’ అని శాస్త్ర వచనం. సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందనీ శ్లోకార్థం. అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులైనారు.
ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలనీ ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి. గోవును, ‘గోమాత’ అని పిలుస్తారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు కాబట్టి భారతీయులకు పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవనసరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తున్నాయి.
పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మున్నగు వాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమగు వస్తు జాతమును అగ్ని నుంచి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వలన గోవు ఒక్కటే ఉత్పన్నమైంది. గోవుకు వేదప్రమాణమైన ప్రాముఖ్యత ఉంది. అగ్ని సంబంధమగు హోమంవలన గోవు జన్మించుటచేత గోవునకు అగ్ని హోత్రమని పేరు వచ్చింది. మన వేదాలలో ‘గో’ మహాత్మ్యాన్ని ఉపదేశించి వివరించే మంత్రాలనేకం ఉన్నాయి. గోమాతకు సకల సంపదలకు పుట్టిల్లుగా అధర్వణ వేదం కీర్తించగా, ఋగ్వేదం ‘గవా తుల్యం నోపశ్యామినృణే త్వామ్’ అని పలుకగా, నిరుపమానమైన ఔన్నత్యం ఆవుకి ఉన్నదని యజుర్వేదం ప్రశంసించింది. ఆవులో దేవతా శక్తులున్నాయని, అతీంద్రియ దర్శనశక్తి కలిగిన మన మహర్షులు దర్శించి చెప్పారు. అందుకే గోవులున్నచోట కుండలినీ శక్తి అధికంగా ఉంటుంది. గోవును సేవించడం వలన, గ్రహ దోషాలు తొలగిపోతాయని, గోవుకి ఆహారం సమర్పించడం ద్వారా పితృదేవతలకి పిండప్రదానం చేయలేని వారికి పిండప్రదానం చేసిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు పేర్కొన్నాయి.
ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘‘నాథా! జనులు పాపము నుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును, తరుణోపాయమును తెలుపమ’’ని అడగగా - శివుడు పార్వతీదేవితో ‘‘గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. పాదములందు పితృ దేవతలు, కాళ్ళయందు సమస్త పర్వతాలు, దంతములందు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జేష్ఠాదేవి, కళ్ళయందు - సూర్యచంద్రాదులు, చెవులయందు శంఖచక్రాలు, కంఠమున విష్ణుమూర్తి, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, వెన్నునందు వరుణ దేవుడు, అగ్నిదేవుడు, తోకలో చంద్రుడు, చర్మమున ప్రజాపతి, రోమావళి యందు త్రిశంకకోటి దేవతలు నివసించెదరు. అందువల్ల గోమాతను పూజించి ఆయురారోగ్యములను, అష్టైశ్వర్యములను పొందవచ్చునని, గోవులకు ఆహారం పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్యఫలం కలుగుతుందని, గోమాతను నమస్కరించి ప్రదిక్షణం చేస్తే భూమండలమంతా ప్రదిక్షణం చేసినంత ఫలము కలుగుతుందని’ చెప్పాడు. భారతీయ గోజాతి అన్ని దేశాల ఆవులకన్నా సౌరశక్తిని అధికంగా గ్రహిస్తుందని, ఆవునేతిని నిప్పుమీద వేస్తే వచ్చే ధూమం పర్యావరణాన్ని కాలుష్య రహితం చేస్తుందని యజ్ఞయాగాదులవల్ల తెలుస్తోంది. అటామిక్ రేడియేషన్ నుండి రక్షణ పొందగల శక్తి ఆవు పాలల్లో ఉందని రష్యన్లు తెలిసికొన్నారు. మన ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. హిందూ మతంలో గోరక్షణ అత్యంత ప్రధానమైనది. అన్నివిధాలా ఆవు మనకు మేలే చేస్తోంది. బ్రతికీ, మరణించీ కూడా ఉపకారమే చేస్తోంది. కనుక గోవులను సంరక్షించుకుందాం!


గోవుకు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠి౦చడ౦ శుభకర౦.
“ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య స౦భవే!
ప్రతీచ్ఛేమ౦ మయాదత్త౦ సౌరభేయి! నమోస్తుతే!!:
ప౦చ భూతాలకు శుభాన్ని కలిగి౦చే పుణ్యస్వరూపిణీ! పవిత్రురాలా! సూర్యుని ను౦డి కలిగినదానా! (సౌరశక్తిలోని దివ్యత్వ౦ గోవులో ఉన్నదని భావ౦). నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరి౦చు. సురభీ వ౦శ౦లో కలిగిన తల్లీ! నీకు నమస్కారము.


గోమాత దర్శనము చేయునప్పుడు చదివే శ్లోకాలు:–
నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్య ఏవచ l
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః ll
భావం:-శ్రీమంతంబులై కామధేను సంతతులైన బ్రహ్మాదులచే స్తుతించబడిన పవిత్రములైన గోవులకు నా నమస్కారము….


గావో మమాగ్రతః నను గావో మే సంతు పృష్టతః l
గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యాహం ll
భావం:–గోవులు నాముందు-వెనుకలందు యుండుగాక. గోవులే నా హృదయము. గోవుల మధ్యయందు నేను నివసించుచున్నాను…..
సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలం కృతే l
మమాభిలషితంకర్మ సఫలం కురు నందిని ll
భావం:–ఓ గోమాతా ! సర్వదేవతాస్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదానా ! నా కోర్కెలను సఫలం చేయుము….


గో మహిమ గురించి శివపార్వతుల సంభాషణ
ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా దయామయుడగు పరమశివుడు ” ఓ పార్వతీ! గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును. ఆ గోవునందు పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది. కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది” అని బోధించాడు.
ఆవు మజ్జిగ

పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది.
మజ్జిగ మూడు దోషాలనూ తగ్గిస్తుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది. ఆవు మజ్జిగ మూడు దోషాలను తగ్గిస్తుంది. పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికారకంగా, బుద్ధివర్థకంగా పనిచేస్తుంది. గేదె మజ్జిగ కఫాన్ని పెంచుతుంది. అలాగే వాపును పెంచుతుంది.
**మజ్జిగను వాడకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు జలోదరం (ఎసైటిస్), యకృద్‌వృద్ధి (హెపటోమెగాలి), ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల్లో మజ్జిగను వాడటం మంచిది కాదు.
* మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
* పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు.
* దురదతో కూడిన అర్శమొలలకు వెన్నతో కూడిన మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన తరువాత మల ద్వారంలో వచ్చే మంట తగ్గుతుంది.
* రక్తస్రావంతో కూడిన అర్శమొలకు వెన్న తొలగించిన మజ్జిగ తీసుకోవాలి. లేదా మజ్జిగలో ఉప్పు, వాముపొడి కలిపి తీసుకోవాలి. అలాగే మరో మంచి చికిత్స ఉంది. చిత్రమూలం వేరు బెరడును ముద్దగా దంచాలి. ఈ పేస్టును కుండలోపల పూసి, దానిలో మజ్జిగ చేసుకొని తాగాలి.
* పిప్పళ్లను వర్ధమాన యోగం రూపంలో మజ్జిగతో వాడాలి. అంటే పిప్పళ్లను పది రోజుల వరకూ రోజుకొకటి చొప్పున పెంచి తిరిగి తగ్గించుకుంటూ రావాలి.
* మూత్రంలో మంటకు మజ్జిగలో శుద్ధిచేసిన గంధకాన్ని కలిపి తీసుకోవాలి.
* చర్మంపైన మంటలకు మజ్జిగలో వాష్ క్లాత్‌ని ముంచి ఒళ్లు తుడుచుకోవాలి.
* సొరియాసిస్, ఎగ్జిమాకు చిక్కని మజ్జిగలో ఒక నూలు గుడ్డను తడిపి కొన్ని గంటలపాటు చర్మవ్యాధి ఉన్నచోట పరిచి ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
* వేరుశనగ, నెయ్యి వంటి ఆహారాలతో ఎలర్జీలకు మజ్జిగకు కాస్తంత పసుపుచేర్చి తీసుకోవాలి.
* ఒంటికణత నొప్పికి అన్నంలో మజ్జిగ పోసుకొని కొంచెం బెల్లం కలిపి తినాలి. దీనిని సూర్యోదయానికి ముందే తీసుకోవాలి.
* విరేచనాలు: మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడిని కలిపి తీసుకోవాలి. లేదా మజ్జిగలో తేనె కలిపి తీసుకోవాలి.
* మల ద్వారం చుట్టూ దురదకు మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. దీనివల్ల మలంలోని ఆమ్లత్వం తగ్గి దురద తగ్గుతుంది.
* నులిపురుగులకు మజ్జిగలో వాయువిడంగాల చూర్ణం కలిపి తీసుకోవాలి.
* మాంసాహారం అరుగుదలకు మజ్జిగలో మాంసపు ముక్కలను నానేసి ఉడికించాలి. మజ్జిగలో ఊరటంవల్ల మాంసంలోని తంతువులు మార్ధవంగా తయారవుతాయి.
* పొడి చర్మం: మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి రాసుకొని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం నునుపుగా తయారవుతుంది.
*మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
ఆవుపాల పెరుగు
ఆవుపాల పెరుగు ఆకలి కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచి శక్తినిస్తుంది. పెరుగు లేదా దధి ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన పాల లో గోరువెచ్చగా ఉండగా మజ్జిగచుక్కలను వేస్తే పాలు గట్టిగా తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి వెన్న,నెయ్యి లను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తియ్యగా ఉంటుంది. తోడు ఎక్కువైతే పెరుగు పుల్లగా ఉంటుంది. పెరుగు ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. ఇది బరువును పెంచుతుంది, శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది.
మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. ఏదైనా ఫెర్మెంటో పాలనే పెరుగు అనడం అర్థవంతంగా లేకపొయినా, పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి.
పెరుగులో పోషకపదార్థాలు:
పోషక పదార్థం
విలువలు
నీటిశాతం 89.1%
ప్రోటీన్ 3.1%
క్రొవ్వులు 4%
మినరల్స్ 0.8%
కార్బొహైడ్రేట్స్ 3%
కాల్షియం 149 మి.గ్రా
ఫాస్పరస్ 93 మి.గ్రా
ఇనుము 0.2 మి.గ్రా
విటమిన్ - ఎ 102 ఐ.యు
విటమిన్ - సి 1 మి.గ్రా
* జలుబుగా ఉన్నపుడు పెరుగు బాగా పనిచేస్తుంది.

* మూత్ర సంబంధమైన రోగాల్లో కూడా పెరుగు ఉత్తమం.
* జిగురు విరేచనాలయ్యేవారికి పెరుగు బాగా పని చేస్తుంది.
* మీగడ తీసిన పెరుగు, పాలపై వెన్న తీసి తయారుచేసిన పెరుగు అత్యుత్తమమైన ఫలితాలనిస్తాయి.
* పెరుగులో పెసరపప్పు, శొంఠి, పంచదార , ఉసిరి కాయ పొడి చేర్చి తింటే అధికమైన ఉపయోగాలు పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతుంది.
*అన్ని రకాల జ్వరాల్లో కూడా పెరుగును నిరభ్యంతరంగా వాడుకోవాలని ఆయుర్వేద సూచన.
* పెరుగులో తియ్యనిది, పుల్లనిది, బాగా పుల్లనిది అని మూడు రకాలు ఉంటాయని సుశృతుడు వివరించాడు. అలాగే పెరుగు వాడటం వలన శరీరానికి చాలా ఉపయోగం అని చరకుడు కూడా తెలిపాడు.
* పెరుగులో ఉండే పోషక విలువలు పాలలో ఉండే పోషక విలువలతో సమానంగా ఉన్నప్పటికీ, పెరుగులో ఉండే ప్రత్యేక గుణం దాన్ని ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలలో ఉన్నత స్థానంలో ఉంచుతుంది. పాలు పెరుగుగా మారడానికి జరిగే ప్రక్రియలో బాక్టీరియా పాలలో ఉండే ప్రోటీన్ ని తేలికగా అరిగేలా చేస్తుంది. ఈ రకమైన మార్పు వలన పెరుగు త్వరగా జీర్ణం అవుతుంది.
* జీర్ణకోశంలో పెరిగే హానికర బాక్టీరియాలని పెరగనివ్వకుండా చేస్తుంది. అంతే కాకుండా మనకి "మంచి" చేసే బాక్టీరియాని పెరిగేలా కూడా చేస్తుంది. ఈ బాక్టీరియా పెరుగులో ఉండే మినరల్స్ త్వరగా రక్తంలో కలిసేలా చెయ్యడం , బి కాంప్లెక్స్ విటమిన్ ని తయారుచేయటం లాంటి పనులు కూడా చేస్తుంది.
* చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది.
* ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది.
* పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.
* ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.
* పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
* చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
** అలాగే ఆయుర్వేదం పెరుగును గురించి చెబుతూ రాత్రి వేళల్లో పెరుగు వేసుకోకూడదంటుంది. అలాగే పెరుగుని వేడి చేసి తినకూడదు.పూర్తిగా తోడుకోని పెరుగును కూడా తినవద్దని ఆయుర్వేదంలో ఉంది. వేసవికాలం పెరుగును ఎక్కువ తీసుకోరాదు. అలాగే ప్రతిరోజూ తినకూడదు.
దేశీయ గోక్షీరం ఆరోగ్య ప్రదాయిని
1. కొంచెం, పలుచగా ఉండి త్వరగా అరుగుతుంది.
2. చిన్నపిల్లలకు తల్లిపాలతో సమానం.
3. మనిషికి చలాకీని పెంచుతుంది.
4. ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతుంది. ప్రేగులలోని క్రిములు నశించును.
5. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
6. చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ణా తులను చేస్తాయి.
7. మనస్సును, బుద్ధిని చైత న్యవంతం చేస్తాయి. సాత్విక గుణమును పెంచుతుంది.
8 ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే బంగారు తత్వముతో కూడిన విట మిను 'ఎ' అధికంగా కలిగిన 'కెసీన్‌' అనే ఎంజైమ్‌ ఉన్నది. దీనివలన ఈ పాలు పసుపు పచ్చగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని బాగా పెంచు తుంది.
9. తెల్ల ఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవు పాలు పిత్తాన్ని, ఎరుపురంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
10. ఆవుపాలు సర్వరోగ నివారణి.
11. ఆవుపాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి.
12. ఘృతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య వర్ధనం- ఆవునెయ్యి బుద్ధిబలాన్ని ఆయుష్షును పెంచుతుంది.
13. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉంది.
14. మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరా లలోని స్థూల భాగం మజ్జ (మూలగ) గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవు తుంది. ఆరోగ్యమైన ఎము కలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికం, శ్రావ్యం అయిన వాక్కు వీటి కోసం ఆవు నెయ్యి, వెన్న తప్పక తిఐ్వ.
15. ఆవునెయ్యి రక్తంలో మంచిదైన హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ను పెంచి చెడుదైన ఎల్‌డిఎల్‌ కొలెస్టిరాల్‌ను తగ్గించును. హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ గుండె జబ్బులు, అధిక రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
16. భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన 'స్వర్ణనాడి' (సూర్యకేతు నాడి) అనే సూక్ష్మనాడీ ప్రవాహ శక్తి కేంద్రం ఉన్నది. సూర్య కిరణములు ఆవు మూపురముపై పడినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై సూర్య శక్తిని గ్రహించి బంగారు తత్వముతో కూడిన పసుపు పచ్చని 'కెసీన్‌' అనే ఎంజైమ్‌ను తయారు చేసి దానిని ఆవుపాలలో పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి, వెన్న పసుపుపచ్చని పసిమి రంగుతో ఉంటాయి. పాశ్చాత్య గోవులైన జర్సీ, హెచ్‌.ఎఫ్‌ వంటి గోవులకు మూపురం ఉండదు. అవి సూర్యశక్తిని గ్రహించలేవు. ఇవి శీతల ప్రదేశంలో చలికి తట్టుకొనే విధంగా పరిణామం చెందినవి. వీటికి మన దేశీయ ఆవుల వలె సూర్యశక్తిని గ్రహించగల స్వర్ణనాడి ఉండదు. అందు వలన వీటి పాలు మంచివి కావు. ఇవి కేవలం అధిక పాల ఉత్పత్తికై యాంత్రిక జీవులుగా మనం భావించ వచ్చును.

భారతదేశ ఉజ్జ్వల భవిష్యత్తు మూపురం ఉన్న ఆవు పై ఆధారపడి ఉన్నది. ఈ ఆవుపాలు చలాకితనాన్ని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వ గుణమును, బుద్ధిబలమును, ఓజస్సును పెంచును. ఓజస్సు మనిషి తెలివికి, ఆకర్షణ శక్తి కి వ్యాధి నిరోధక శక్తికి ప్రధాన కారణం.
ఆవునెయ్యి ఆరోగ్యకరమైన మంచి ఎముకలను, మంచి రక్తాన్ని ఉత్పత్తి చేయు మూలుగును, మంచి వాక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్ధిబలాన్ని పెంచును. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచును. రక్తంలో చెడు కొలెస్టరాల్‌ అయిన LDL Cholesterol పెరగనివ్వదు. ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తం మంచి మూల కణ ములు (Stem cells) ఉత్ప త్తి అయి వ్రతిశరీర అవయ వమును శక్తివంతంగా ఉంచి వ్యాధి కారక క్రిములను Aidsను కలుగచేయు Virus క్రిములతో సహా) చంపివేసి, ఆరోగ్యమును కలుగచేయును. స్త్రీలలో ఎము కలు బలహీనమై Osteoporosis Arthritis అనే వ్యాధి రాకుండా ఉండు టకు, వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణీ స్త్రీలు కాల్షియం పొందుటకు-కాల్షియం మాత్రల కన్నా ఆవునెయ్యి ఎంతో శ్రేష్ఠమైనది. స్త్రీ గర్భంలోని బిడ్డకు ఎముకల పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది. ఈ జన్మలో నిత్యం తీసుకొనే ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి సూక్ష్మ అంశతో ఏర్పడే 'మనస్సు బుద్ధి' రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలాన్ని ప్రసాదిస్తుంది.

ఆవు వెన్న (నవనీతము)
షడ్రుచులు అంటే ఆరు రుచులు. అవి తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు రుచులు. ఈ రుచులతో కూడినపదార్ధములు తినిననచో మన శరీరములో షడ్రసములు ఉత్పత్తి అవుతాయి. యివి 1) మధురరసం (తీపి), 2) ఆమ్లరసం (పులుపు), 3)లవణరసం (ఉప్పు), 4) కటురసం (కారం), 5) తిక్తరసం (చేదు), 6) కషాయరసం (వగరు). ఈ షడ్రసములు సమపాళ్ళలో వున్నట్లయితేమన ఆరోగ్యం బాగు ఉంటుంది. ఎక్కువ తక్కువ లయినట్లయితే దానికి సంబంధించిన అనారోగ్యము వస్తుంది. ఉదా|| మధురరసంపెరిగినచో చక్కెరవ్యాధి, ప్రకృతిలో ప్రతి ఆహారపదార్ధములో ఏదో ఒక చుచి ఉంటుంది. కానీ నవనీతంలో ఒక విశుద్ధ గుణమున్నది. షడ్రచులలో ఏ రుచికి చెందని మాధుర్యమైన సాత్వికమైన మధురరసం (ఇది మామూలు తీపి రుచి కాదు) నవనీతములో ఉన్నదవి.
నవనీతము విశుద్ధ వర్ణము కలది, సత్వగుణము కలది, శాంత రసము కలది, కనిపించే సూర్య కాంతికి, స్పటికమునకు నీటికి రంగులేదు.అలాగే రుచి చూసే వస్తువులలో వెన్నకు రుచిలేదు. వెన్నలో వున్న శాంతరసమందు మనస్సు, సత్వగుణమును శాంతిని, తన్మయత్వమును,ససమాధిని పొందుతుంది. అందుకే శ్రీకృష్ణు మనకు తెలియచేయుటకు నవనీతమును నోటినిండ తినేవాడు. నవనీత చోరుడు ఆయన.యిటువంటి నవనీతమును మనకు ప్రసాదించుచున్న గోవునకు జయమగు గాక.
సాధారణంగా ప్రతి ఇంట్లోనూ వెన్న, నెయ్యి తరచూ వాడుతుంటారు. మేధాశక్తిని, చురుకుదనాన్ని పెంచే శక్తిగల వెన్న వలన అనేక ప్రయోజనాలు, మరెన్నో సద్గుణాలు ఉన్నాయి.* మజ్జిగను చిలికి తీసిన వెన్న మధురంగా ఉండటమేగాక శరీరంలో ధాతువులను సమస్థితికి తీసుకువచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంటే మెటబాలిజం అనే జీవన ప్రక్రియను శరీరం సక్రమంగా నిర్వర్తించుకునేలా చేస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. జఠర రసాన్ని పెంచి, జీర్ణకోశాన్ని క్రమబద్ధీకరిస్తుంది. పొడి దగ్గును అరికడుతుంది. వెన్న కొంచెం ఆలస్యంగా అరుగుతుంది. కానీ, బలవర్థకమయినది. కాలేయాన్ని బలంగా ఉంచుతుంది. చర్మరోగాలను దరిచేరనీయదు. పిల్లల చేత వెన్న తినిపిస్తే మేధాశక్తి పెరుగుతుంది.
* తాజా వెన్నలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఎ, బి, సి, డి విటమిన్లు ఉన్నందున ఎదిగే పిల్లలకు వెన్న చక్కని పౌష్టికాహారం. వెన్నలో లభించే కొవ్వు పదార్థం సులభంగా జీర్ణమై, బలాన్ని వృద్ధిపరుస్తుంది. ప్రతిరోజూ పెరుగును చిలికి వెన్న తీసి పిల్లలకు పెడితే మేధావంతులుగా, ఆరోగ్యంగా పెరుగుతారు. వెన్నను శరీరానికి మర్దనా చేసినట్లయితే చర్మానికి వర్ఛస్సును, మృదుత్వాన్ని ప్రసాదిస్తుంది. నీరసించే పిల్లలకు, బలహీనులకు, గుండె బలం తక్కువగా ఉన్నవారికి వెన్న అత్యుత్తమమయినది.
* ఆవు వెన్నకు, గేదె వెన్నకు చాలా తేడా ఉంటుంది. శరీరానికి అవసరమైన చమురు గుణాన్ని కలుగజేసి, చలువను, దృఢత్వాన్ని కలిగించడంలో ఆవు వెన్న అత్యుత్తమమయినది. గేదెవెన్న కంటే ఆవు వెన్న సులభంగా జీర్ణమవుతుంది. వాతము, పిత్తమును క్రమబద్ధీకరించి, రక్తదోషము, క్షయ, మూలవ్యాధులను నివారించడంలో ఆవు నెయ్యి విశిష్టమైనది. అంతేగాక, ఈ రెండు రకాల వెన్న బలాన్ని, వీర్యవృద్ధిని, వర్ఛస్సును కలుగజేస్తాయి.
* వెన్నలో పంచదార కలిపి తీసుకుంటే కడుపులో మంట, పోట్లు సమసిపోతాయి. తేనె, చెరకురసం, ఉప్పు వెన్నకు విరుగుడు.
ఘృతం
ఆవునెయ్యిని ఘృతం అంటారు, మేధాశక్తిని పెంపొందించడంలో నెయ్యే అగ్ర తాంబూలం. ఆయుర్వేదం ప్రకారం నెయ్యితో కూడిన ఆహారపదార్థాలను (జీడిపప్పు వంటివి) తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించుతాయి. ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా అవుతుంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాల్సి వుంటుంది. ఇందులో "విటమిన్ A" వుంటుంది.
ఆవునెయ్యి ఆరోగ్యానికి ఉపయోగకరమనీ, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందనీ ప్రయోగపూర్వకంగా నిరూపితమైంది. దీపారాధన చెయ్యటానికీ, యజ్ఞయాగాలకూ ఆవునెయ్యిని వినియోగిస్తారు. ఆవునెయ్యితో వెలిగించిన దీపం వున్న గదిలో వున్నవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
యజ్ఞయాగాదులలో ఆహుతి చేసిన ఆవునెయ్యి నుంచి వచ్చిన ఆవిరి ఆకాశంలో 7, 8 కి.మీ. ఎత్తుకి వెళ్ళి వర్షాలు పడతాయని రష్యా శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనిపెట్టారు. మనవాళ్ళు కృత్రిమ వర్షాలు కురిపించటానికి మేఘమధనానికి వాడే కెమికల్స్ వల్ల కురిసే వర్షాలలో నీరుకూడా కాలుష్యమయమై వుంటుంది.
పురాణాలలో కధ ప్రకారంకూడా గాంధారి గర్భపాతం చేసుకున్నప్పుడు ఆ అండాన్ని కుండలలో ఆవునెయ్యిలో భద్రపరిచారుట. ఆయుర్వేదంలో ఎన్నో మందులలో ఆవునెయ్యి కలుపుతారు. ఆవునెయ్యికి కొన్ని ఏళ్ళవరకు భద్రపరిచే గుణం వుంది.
ఆరోగ్యానికి కూడా ఆవునెయ్యి మంచిది. ఈ మధ్య ఆరోగ్యంకోసమని చాలామంది నెయ్యి, నూనె తినటం మానేస్తున్నారు. కానీ ఆవునెయ్యి తినటంవల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో వుంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అల్సర్స్ నయమవుతాయి. జీర్ణక్రియని ఉత్తేజపరిచి జీర్ణకోశాన్ని కాపాడుతుంది. శరీరంలో దోషాల్ని కొట్టేసి కురుపులు రాకుండాఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే రోజూ ఆహారంలో నియమిత రూపంలో ఆవునెయ్యి వాడాలి.
ఆవునెయ్యి మేధస్సును పదునుపరుస్తుంది. కళ్ళకి మంచి చేస్తుంది. మనసును ప్రశాంతంగా వుంచుతుంది. జీర్ణక్రియను బాగుపరుస్తుంది. అందుకే మిగతా నూనెలు మానేసినా రోజూ రెండు చెంచాలు ఆవునెయ్యిని ఆహారంతో తీసుకుంటే ఎన్నో రోగాలనుంచి దూరంగా వుండవచ్చు.
దైవకార్యాల్లోను ... శుభకార్యాల్లోనూ ఆవునెయ్యిని ఉపయోగించడమనేది ప్రాచీనకాలం నుంచి ఒక నియమంగా వస్తోంది. సాధారణంగా వివిధ క్షేత్రాల్లో ... వివిధ దేవతా స్వరూపాలకు నిత్యాభిషేకాలను పంచామృతాలతో నిర్వహిస్తుంటారు. ఈ పంచామృతాలలో ఆవుపాలు .. ఆవుపెరుగు ... ఆవునెయ్యి ... ప్రధానంగా కనిపిస్తూ వుంటాయి. ఈ మూడింటిలోనూ ఆవునెయ్యి అత్యంత పవిత్రమైనదిగా ... విశిష్టమైనదిగా చెబుతుంటారు.
ఈ కారణంగానే దైవకార్యాలకి సంబంధించిన యజ్ఞయాగాది కార్యక్రమాలలోనూ, దోష నివారణార్థం చేసే శాంతి హోమాలలోను ఆవునెయ్యి తప్పనిసరిగా వాడుతుంటారు. అలాగే దేవతలకి నివేదన చేసే వివిధరకాల పదార్థాలలోను ఆవునెయ్యినే ఉపయోగిస్తుంటారు. దేవాలయాలకి సంబంధించిన విషయాల్లోనే కాదు, ఇంటికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లోనూ ఆవునెయ్యిని ఉపయోగించడమే శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. దీపారాధనకు ... నైవేద్యాలకు తప్పనిసరిగా ఆవునెయ్యినే వినియోగించాలని అంటోంది.
అయితే కొంతమంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆవునెయ్యి అందుబాటులోలేదని చెప్పేసి గేదె నెయ్యితో పని పూర్తి చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన అనేక దోషాలు అక్కున చేరతాయని శాస్త్రం చెబుతోంది. గేదె నెయ్యితో దీపారాధన చేయడం వలన, నైవేద్యాలు తయారు చేయడం వలన నీచమైన జంతుజన్మలు కలుగుతాయని అంటోంది.
అందువలన పుణ్యఫలాలను ఆశించి చేసే దైవకార్యాలలో పాపాలను కొనితెచ్చే పనులు జరగకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా వుంది.ఈ విషయంలో శాస్త్రం సూచించిన నియమాలను పాటించడమే అన్ని విధాలా మంచిది. అప్పుడే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ... ఉత్తమగతులు లభిస్తాయి.

1 comments:

Unknown said...

ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

Post a Comment